స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టియారెస్ పార్టీ, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో వినూత్నమైన పంథాను ఎంచుకున్నది. సామాజిక సంతులనం, ఉద్యమ నేపథ్యాలకు పెద్ద పీఠ వేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అన్ని జిల్లా స్థానాలను గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 64 స్థానాలకు ఈరోజు జరిగిన జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికలో మొత్తం 40 స్థానాలను బడుగు, బలహీనవర్గాలకు కేటాయించింది. బీసీలకు 7, ఎస్సీలకు 6 ఎస్టీలకు మరో నాలుగు జడ్పీ చైర్మన్లను కేటాయించింది. మెత్తం 17 జిల్లా జడ్పీలను బడుగు బలహీన వర్గాలకి అప్పజెప్పడంతోపాటు మరో 23 జడ్పీ వైస్ చైర్మన్ లను సైతం బలహీన వర్గాలకు చెందిన పార్టీ నాయకులను ఎంపిక చేసింది. ఈ మొత్తం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎంపిక కు సంబంధించి గత మూడు రోజులుగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని దాదాపు అన్ని జిల్లా స్థానాలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ లకు సంబంధించిన ఎంపిక పైన ఏకాభిప్రాయం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పలు జిల్లాల మంత్రులు ఈ మేరకు కేటీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమై జడ్పీ చైర్మన్ లను ఎంపిక చేశారు. ఈసారి సాధ్యమైనంత ఎక్కువమంది బడుగు, బలహీనవర్గాలకు, ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలన్న పార్టీ ఆలోచన మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందని చర్చల సందర్భంగా కేటీఆర్ స్థానిక మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలిపారు. దీంతో గత దశాబ్దంన్నరగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఎవరైనా జడ్పీటీసీలుగా గెలిచి ఉంటే వారి వివరాలు ఇవ్వాలని కెటియార్ మంత్రులకు ప్రత్యేకంగా సూచించారు. ఈ మేరకు పలు జిల్లాలో ఉద్యమ నేపథ్యం కలిగి, పార్టీలో కొనసాగుతున్న పలువురు నాయకులకి జడ్పీ పొస్టులు దక్కేలా చర్యలు తీసుకున్నారు. ములుగు జిల్లాకు చెందిన కుసుమ జగదీష్, నల్గొండ జిల్లాకు చెందిన బండ నరేందర్ రెడ్డి, వరంగల్ అర్బన్ కి చెందిన డాక్టర్ సుధీర్ కూమార్, అదిలాబాద్ కి చెందిన రాథోడ్ జనార్ధన్ ఉద్యమకారుల కోటాలో చైర్మన్ పదవి దక్కించుకున్న వారిలో కొందరు. కేటీఆర్ సొంత జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థి నాయకుడు సిద్ధం వేణు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గా అవకాశం దక్కింది. కేవలం జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ లోనే కాకుండా కోఆప్షన్ మెంబర్ లకు సంబంధించి కూడా ఇదే సూత్రాన్ని పార్టీ అమలు చేసింది. దీంతో ఈరోజు పదవులకు జరిగిన ఎంపికపైన పార్టీ శ్రేణులతోపాటు, ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కెసియార్ గారు అభ్యర్ధుల ఎంపికలో కెటియార్ చేసిన కసరత్తును ప్రత్యేకంగా అభింనందించారు.
