తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో పడిన కీలక ముందడుగు పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి నుండే జరుగుతున్నందున హైదరాబాద్ లోని భవనాలన్నీ ఖీళీగా ఉన్నాయన్నారు. అలా ఖాళీగా ఉండే బదులు ఉపయోగంలోకి తీసుక రావాలనే ఆలోచన ఉత్తమం అయినదని సిఎం అన్నారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలే పరమావదిగా, స్నేహ భావంతో ముందడుగు వేయడం శుభపరిణామం అన్నారు. ప్రతీ విషయంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి , ఇచ్చిపుచ్చుకునే ధోరణి లో రెండు ప్రభుత్వాలు పని చేస్తాయని సిఎం ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని, అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతం అని సిఎం అన్నారు.