వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు భారీగా పెంచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే చరిత్ర సృష్టించిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్న వారంతా సిగ్గుపడాలన్నారు. మాజీసీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. విజయసాయి ట్విటర్ ఇలా మాట్లాడారు.. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేశారు. ‘నేను చూసాను. నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు యువ ముఖ్యమంత్రి కిడ్నీ బాధితులకు నెలకు పదివేల ఆసరా కల్పించారని పేర్కొన్నారు.
దుబారా ఖర్చులను సీఎం వైఎస్ జగన్ కట్టడి చేశారని, ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రతి రూపాయి వ్యయానికి జవాబుదారితనం ఉంటుందని, హిమాలయా వాటర్ బాటిల్స్ ఇకపై కనిపించవని చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసికూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదని వేణుంబాక మండిపడ్డారు.