రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అధికార తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కరెంట్ బిల్లు కట్టకుండా టీడీపీ నేతలు పారిపోయారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులోని పాత కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం ఖాళీ చేసి కరెంట్ బిల్లు చెల్లించకుండా టిడిపి నేతలు వెళ్లిపోయారంటూ ఇంటి యజమాని ఏకంగా ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు. రెండు నెలలుగా స్థలం యజమాని NRI పొట్లూరి శ్రీధర్ వెంటబడుతున్నా సమాధానం టిడిపి నేతలు సమాధానం చెప్పకపోవడంతో ఆయన బయటకు వచ్చి విషయాన్ని వెల్లడించారు. 2009లో ఈ స్థలం టిడిపి జిల్లా కార్యాలయానికి శ్రీధర్ లీజుకిచ్చారు. లీజు విషయంలో కూడా లక్షలాది రూపాయలు పెండింగ్ పెట్టి చివరకు నగరానికి చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలతో సెటిల్ చేయించుకున్నారంటూ ఆయన వెల్లడించారు.
విద్యుత్ బిల్లు లక్షల రూపాయల బకాయిలు ఉంటే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎందుకు ఊరుకున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఇన్ని సంవత్సరాలు విద్యుత్ బిల్లులు కట్టకుండా బాధ్యతారాహిత్యంగా ఉండటం సమంజసంగా లేదని, సాధారణ పౌరులు పది రోజులు లేట్ అయితే ఫీజులు పీక్కు పోయే విద్యుత్ అధికారులు ఈ కార్యాలయానికి ఇన్ని రోజులు విద్యుత్ సరఫరా ఎలా చేశారని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విధంగా భావించి ఇప్పుడు ముందుకొచ్చానని చెప్పారు. ఇప్పటికైనా టిడిపి నేతలు బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించాలని, ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదు ఎటువంటి పోరాటానికైనా సిద్ధమన్నారు.