మిషన్ భగీరథ లాంటి పథకాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు T. రాజశేఖర్ . చాలా రాష్ట్రాలు బోరు బావుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నాయని , నదీ జలాల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన రాజశేఖర్ ముందుగాల గజ్వెల్ మండలం కోమటి బండ మిషన్ భగీరథ సంపుహౌస్ ను పరిశీలించారు. కోమటిబండ నుంచి తాగు నీరు సరఫరా అయ్యే తీరును మ్యాప్ తో ఈఈ రాజయ్య వివరించారు. సంప్ హౌస్ మొత్తం తిరిగి నిర్మాణాలన్నింటిని రాజశేఖర్ చూసారు. ఆ తరువాత మర్కుక్ మండలం ఎర్రవెల్లి, దాతర్పల్లి లోని భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. గ్రామస్తుల స్పందనను తెలుసుకున్నారు. అక్కడినుంచి సిద్దిపేట మండలం ముండ్రాయి లో 24 గంటలు తాగునీరు సరఫరా అవుతున్న గంగిరెద్దులోళ్ళ కాలనీ కి వెళ్లారు. 24 గంటలు తాగునీరు అందించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంతో పర్యవేక్షణ, శ్రమ ఉంటే తప్ప 24 గంటలు తాగునీరు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అక్కడి నుంచి ఎల్లుపల్లి కి వెళ్లిన రాజశేఖర్ గ్రామస్తులతో మాట్లాడారు. అంతకుముందు కోమటిబండ లో మీడియాతో మాట్లాడిన రాజశేఖర్ పథకం అమలు చేస్తున్న విధానం గొప్పగా ఉందన్నారు.నీరు వృధా కాకుండా అమలు చేస్తున్న ఫ్లో కంట్రోల్ వాల్వ్ విధానం విప్లవాత్మకం అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలు మిషన్ భగీరథ ను ఆదర్శంగా తీసుకొని అమలుకు ప్రణాళికలు రచిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి బీహార్ రాష్ట్రం ఇప్పటికే ఘర్..ఘర్ కో పీనేకా పానీ పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. మరో 7 రాష్ట్రా లు ఇదే బాటలో నడుస్తాయన్న సమాచారం తమకు ఉందన్నారు. దేశం లోని అన్ని రాష్ట్రాలు ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవ్వడాన్ని కర్తవ్యం గా భావించాలన్నారు. రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటన లో తాను గమనించిన అంశాలపై కేంద్ర తాగునీటి శాఖకు నివేదిక అందిస్తానని చెప్పారు.