టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని, ప్రాంతీయ పార్టీలు కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు. ఒక ప్రముఖ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాండ్లుగా టీఆర్ఎస్ చెప్తున్నట్టుగానే కేంద్రంలో ప్రాంతీయపార్టీలు ముఖ్యభూమిక నిర్వహించనున్నాయని పేర్కొన్నారు.
జాతీయ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజార్టీ రాదని మొదట్నుంచీ చెప్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఒక్కోదశ ఎన్నికల తరువాత అక్కడి పరిస్థితులను గమనిస్తే అదే అర్థమవుతుందన్నారు.
యూపీఏ, ఎన్డీయేలో లేని ఇతరపక్షాలు ప్రస్తుతం కీలకంగా మారుతాయని చెప్పారు. సంకీర్ణాల వల్ల స్థిరమైన ప్రభుత్వం ఉండదనే మాట సరికాదని.. ఈ విషయంలో దేశం పరిణతి చెందిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాల్లోని ప్రాంతీయ పార్టీలు భారీసంఖ్యలో సీట్లు గెలుచుకుంటాయన్నారు.