జస్టిస్ నూతిరామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె పెద్ద కుమార్తెను తల్లికి అప్పగించాలని సూచించింది. అయితే వారంలో రెండు రోజుల పాటు తండ్రి వద్ద బిడ్డను ఉంచాలంది. తదుపరి విచారణను జూన్4కు వాయిదా వేసింది.
తన కుమార్తెలను అప్పగించాలంటూ జస్టిస్ రామ్మోహన్రావు కోడలు సింధు శర్మ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నర వయసున్న చిన్న కుమార్తెను ఇప్పటికే ఆమెకు అప్పగించారు. అయితే, పెద్ద కుమార్తె విషయంలో కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ మేరకు హైకోర్టులో బుధవారం ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కుమార్తెతో సహా భార్యాభర్తలిద్దరూ గురువారం కోర్టుకు హాజరయ్యారు. సుమారు గంటపాటు వాదనలు విన్న ధర్మాసనం.. కొన్ని షరతులతో బిడ్డను తల్లికి అప్పగించాలని ఆదేశించింది. ఐదు రోజుల పాటు తల్లి వద్ద.. రెండు రోజులు తండ్రి వద్ద చిన్నారిని ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. శుక్రవారం సాయంత్రం పెద్ద కుమార్తెను తీసుకెళ్లి సోమవారం ఉదయం అప్పగించాలని తండ్రి వశిష్ఠకు సూచించింది. ఈ ప్రక్రియను తదుపరి విచారణ జరిగే జూన్ 4 వరకు కొనసాగించాలని పేర్కొంది.
