కర్నూల్ జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు నంద్యాలకు తీసుకొచ్చి ఆయన ఇంటి వద్ద ఉంచారు. ఎస్పీవై రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, పలు పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయం నుంచి పట్టణంలోని బొమ్మలసత్రంలోని ఎస్పీవైరెడ్డి స్వగృహం ప్రజలతో నిండిపోయింది. పైపుల రెడ్డి ఇక లేరని పలువురు కన్నీరు మున్నీరయ్యారు. .
