తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి ఇప్పటికే తాళం పడిందని, అమరావతిలోని టీడీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు వేసుకోవడం ఖాయమని వైసీపీ నేత రెహమాన్ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ కొన్ని దుష్టశక్తులు వైఎస్సార్ కుటుంబాన్ని ఎన్నోవిధాలుగా ఇబ్బందులకు గురిచేసినా, ప్రజాభిమానమే ఈనాటి వరకు వారికి అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు దోపిడీనే ధ్యేయంగా ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. పాలన అంటే ఏమిటో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసి చూపారన్నారు. ఆయన ఆశయాలతో పార్టీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే జనరంజక పాలన అందిస్తారని, అప్పుడు చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు. మరో ఆరు నెలల్లో టీడీపీ పార్టీ ఐస్ లా కరిగిపోవడం ఖాయమని దీంతో చంద్రబాబుకు భయంపట్టుకుందన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి కళ్లకు కనిపిస్తున్నందున భరించలేక జగన్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి సుభిక్ష పాలనను అందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు.
