ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే టీడీపీ అభ్యర్థి తన ఓటమిని ఖరారు చేసుకున్నారు. కడప జిల్లా బద్వేల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్ రాజశేఖర్ ….పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. వైసీపీకి కంచుకోట అయిన బద్వేల్లో పరాజయం తప్పదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో తన ఓటమి ఖాయమని నిర్థారించుకున్న రాజశేఖర్ నిన్న తన కుటుంబసభ్యులతో సమావేశం అయ్యారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే అంశంపై చర్చించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే టికెట్ కోసం తాను ఇచ్చిన రూ.3 కోట్లు తిరిగి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం బద్వేల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సమయంలో రాజశేఖర్ ఉదంతం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
