రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా పేరున్న కర్నూలు జిల్లా రాజకీయం రంజుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంగా, రాయలసీమ ముఖద్వారంగా ఉన్న కర్నూలు జిల్లాలో రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. పార్టీ ఫిరాయింపులే ఈసారి జిల్లా ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు రాజ్యమేలుతోంది. ఇంకేముంది ప్రతిపక్ష పార్టీ పనులు చక్కబెట్టేసుకుంది. వచ్చే ఎన్నికల్లో కర్నూలు కొండారెడ్డి బురుజు కోటపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు వైసీపీ సిద్ధమైపోతుంది. సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు ఎన్నిసార్లు దిశానిర్ధేశం చేసినా, ఎన్ని వ్యూహాలు అమలు చేసినా ఫలితం దక్కే అవకాశం కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటానికి జిల్లా వేదిక అయినా.. పార్టీ కార్యక్రమాలన్నీ జనం మధ్య జరిగేలా చూసిరా ఆశలు వదులుకునే పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ పలుమార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి తమ్ముళ్లలో జోష్ నింపినా వైసీపీకి కర్నూలూ జనం గుండెల్లో నింపుకున్న ప్రేమాభిమానాలముందు ఇవేమీ పనిచేయలేదు.
జిల్లాలో నాడు తండ్రులు ఆధిపత్యం చలాయిస్తే నేడు తనయుల హవా కొనసాగుతోంది. 2014 ఎన్నికలలో 14 నియోజకవర్గాలలో 11 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు టీడీపీ గెలుచుకున్నాయి. 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీలో టీడీపీ బలం 8కి పెరిగితే, వైసీపీ బలం ఆరుకు చేరింది. కొందరు ఎమ్మల్యేలు పార్టీలు మారడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈసారి వైసీపీ 14సీట్లలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓ రెండుమూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ అధినేత జిల్లాలోని జగన్ ఆళ్లగడ్డలోని చాగలమర్రి నుంచి పత్తికొండలోని తుగ్గలి మండలం ఎర్రగుడి వరకు చేసిన పాదయాత్ర వైసీపీ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పార్టీ నాయకులు జనం మధ్యలో ఉండేలా కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బందులు, రాస్తారోకోలు నిర్వహించారు. ఇంటింటికి వైసీపీ, జగన్ కావాలి.. జగన్ రావాలి.. కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లారు. పార్టీ కీలక అజెండా నవరత్నాలపై అవగాహన కల్పించారు. బూత్ స్థాయిలో కార్యకర్తలను శిక్షణ ఇచ్చారు.
వైసీపీ అభ్యర్ధులు ఈ స్థానాలనుంచి వీరు బరిలోకి దిగుతున్నారు.
ఆళ్లగడ్డ – గంగుల బీజేంద్రరెడ్డి
శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు (ఎస్సీ) – ఆర్థర్
కర్నూలు – అబ్దుల్ హఫీజ్ఖాన్
పాణ్యం – కాటసాని రాంభూపాల్రెడ్డి
నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి
బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి
డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
పత్తికొండ – కంగాటి శ్రీదేవి
కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సుధాకర్బాబు
ఎమ్మిగనూరు – కె.చెన్నకేశవరెడ్డి
ఆదోని – వై.సాయిప్రసాద్రెడ్డి
ఆలూరు – గుమ్మనూరు జయరాం
మంత్రాలయం – వై.బాల నాగిరెడ్డి
నంద్యాల పార్టమెంటు పరిధిలోని శ్రీశైలం సీటు బుడ్డా రాజశేఖర్ రెడ్డికి, పాణ్యం సీటు ఇటీవలే వైసీపీ టీడీపీలో చేరిన గౌరు చరితారెడ్డికి, ఆళ్ళగడ్డ సీటు భూమా అఖిలప్రియకు, డోన్ సీటు కేఈ ప్రతాప్ కు కేటాయించారు. కర్నూలు పార్టమెంటు పరిధిలోని పత్తికొండ సీటు కేఈ శ్యాంబాబుకు, ఎమ్మిగనూరు సీటు బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి, మంత్రాలయం సీటు తిక్కారెడ్డికి, ఆదోని సీటు మీనాక్షినాయుడికి, ఆలూరు సీటు కో్ట్ల సుజాతమ్మకు కేటాయించారు. ఇక వైసీపీ నుంచి నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆర్ధర్ కు మద్దతిస్తున్నారు. రిటైర్డ్ డీజీపీ ఇక్బాల్ వైసీపీలో ముస్లిం మైనార్టీ ఓట్లను ప్రభావితం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం చేరికతో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. కోట్ల కుటుంబ రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి పనిచేస్తున్నారు. ఇక జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న కేఈ కుటుంబం నుంచి పత్తికొండ అభ్యర్ధిగా ఆయన కుమారుడు డోన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. వైసీపీ అభ్యర్ధి, సౌమ్యుడు, విద్యావంతుడైన బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి హవాముందు టీడీపీ అభ్యర్ధి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో ప్రధాన అభియోగం ఎదుర్కొంటున్న కేఈ కుటుంబ సభ్యుడు ప్రతాప్ బోన్ లో కేఈ శ్యాంబాబుకు పత్తికొండలో కనీసం డిపాజిట్లు కూడా దక్కేలా కనిపించట్లేదు. దశాబ్ధాల కాలంగా కేఈ, కోట్ల కుటుంబానికి ఉన్న రాజకీయ పోరులో వాళ్లను ఒకరినొకరు ఓడించుకుంటారనే ప్రచారమూ జరుగుతోంది. కర్నూలు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, పాణ్యం, ఆలూరు, నందికొట్కూరు, బనగానపల్లె, నంద్యాల నియోజకవర్గాల్లో వైసీపీకి స్పష్టమైన ఆదిక్యం కనిపించే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఒక్క ఎమ్మిగనూరులో మాత్రం బీవీ నాగేశ్వరరావు టీడీపీ తరపున గెలిచే అవకాశం మాత్రమే కనిపిస్తోందట. వైసీపీ హవా మరింత పెరిగితే ఈ సీటు కూడా టీడీపీ గెలిచే అవకాశం కోల్పోతుందని చెప్తున్నారు. కడప తర్వాత కర్నూలు వైసీపీకి రెండో కంచుకోటగా నిలుస్తుందని చెప్తున్నారు. పార్టీ మారివచ్చిన నేతలు, పార్టీని వీడి వెళ్ళి టీడీపీనుంచి పోటీచేస్తున్న నేతల బలా బలాలు, నేటి రాజకీయ పరిస్థితులు, సమీకరణలు బేరీజు వేసుకుని వైసీపీ బలంగా బరిలోకి దిగుతోంది. టీడీపీ అభ్యర్ధులకు దీటుగా తమ అభ్యర్ధులను రంగంలోకి దింపుతోంది. ఈ సమీకరణాలతో కడప మాదిరిగా కర్నూలు కూడా క్లీన్ స్వీప్ చేసినా ఎటువంటి ఆశ్చర్యం లేదని కర్నూలు జిల్లా రాజకీయాల్ని విశ్లేషించినవారు చెప్తున్నారు.
