సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాను చోరీ చేసిన నేరంపై టీడీపీ అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతవేటు వేయాలని కోరారు. ఓటుకు కోట్ల కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగ చంద్రబాబు అని, ప్రజలడేటా చోరీచేసిన ఘనుడు ఐటీమంత్రి నారాలోకేష్ అన్నారు. వీరిద్దరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు. ప్రజల విలువైన సమాచారాన్ని దొంగిలించి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారని, ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కేసులో ప్రధాన నిందితులు చంద్రబాబు, లోకేష్ అని, వీరి సహకారంతోనే డేటా లీక్ అయిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఫారమ్ –7 అంటూ డ్రామాలు ఆడుతున్నారని, ఐదేళ్లు పాలించాలని అధికారమిచ్చిన ప్రజలను చంద్రబాబు నడిరోడ్డున నిలబెట్టాడని రోజా విమర్శించారు. చేసిన నేరాన్ని ఒప్పుకొని చంద్రబాబు వెంటనే పదవి నుంచి తప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రోజా డిమాండ్ చేసారు.
