వచ్చే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ కల్వకుంట్ల రామా రావు జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఇది 100 శాతం గ్యారెంటీ అని మీడియాతో కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. ఇక కేసీఆర్.. జగన్ను కలవాల్సిన టైంలో కలుస్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీకి వ్యతిరేకంగా ఏ ఒక్క పనీ చేయలేదన్నారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఎన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టినా ఏపీ ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. చంద్రబాబులో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్నే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పక్క పార్టీలపై ఏడ్వకుండా రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి ఓట్లడగాలని హితవు పలికారు. చంద్రబాబు ఢిల్లీలో కాదు.. విజయవాడలో కూడా చక్రం తిప్పలేరని విమర్శించారు. ఆంధ్రాలో పారిశ్రామికవేత్తలైన ఎంపీల మీద ఐటీ రైడ్స్ జరిగితే చంద్రబాబుకు బాధెందుకు అని ప్రశ్నించారు. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5సీట్లూ కచ్చితంగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
