మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్ క్యాస్ట్ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. ‘మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట’ అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు.
ఆ సమయంలో ఓ దళితుడు తాను మాట్లాడతానని మైక్ అడగడంతో చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. అసభ్య, అభ్యంతరకర పదజాలంతో దళితులపై విరుచుకుపడ్డాడు. ‘మొన్న జగన్ వచ్చినప్పుడు నేను కావాలంటే అడ్డుకునేవాడిని కదా.. నేను మాట్లాడానా.. అప్పుడు గొడవ పడితే మీరు రారా..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీడు మాట్లాడతానంటూ మైక్ అడుగుతున్నాడంటూ చింతమనేని మండిపడ్డారు. ‘రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట..’ అంటూ చింతమనేని దళితులను ఇష్టారీతిన దూషించి అవమానించాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో చింతమనేని వివక్షపూరిత వ్యాఖ్యలపై దళిత సంఘాలు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తామంటే టీడీపీ నాయకులకు ఇంత చిన్నచూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అంత నీచంగా కనిపిస్తున్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తు చేస్తూ.. వాళ్ల అధినేతే అలా ఉన్నప్పుడు టీడీపీ నాయకులు అంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించడం అత్యాశే అవుతుందని వ్యాఖ్యానించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులు శుభ్రంగా ఉండరంటూ అవమానించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో పథకం ప్రకారమే దళితులపై దాడులు జరుగుతున్నాయని, రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ముందు చింతమనేనని వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. తమను హీనంగా చూస్తున్న టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.