వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో బీసీల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని ఆపార్టీ నాయకులు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్తో బడుగుల్లో భరోసా కలిగిందని, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధతను తీసుకువస్తామని చెప్పారు. ఏ సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరుగుతుందన్నది చెబుతామన్నారు. బీసీ డిక్లరేషన్కు మొదటి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని, ఏడాదికి రూ.15 వేల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేసి ఆయా సామాజిక వర్గాలకు మేలు చేస్తామన్నారు.
139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక చేయూతనిస్తామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో ఆ సామాజికవర్గాలకు ప్రతినిధులనే చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమిస్తామని, ఆ సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. 139సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యాలలో జగన్ గుర్తింపు ఇస్తారన్నారు. రాజకీయ ప్రయత్నాలకు వాడుకోకుండా, బీసీలను గౌరవించాలనే భావనతో జగన్ ఉన్నారన్నారు. కుల వృత్తితో జీవనం సాగిస్తున్న వారికి ప్రతి నెల 2వేలు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు.
మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారికి డీజిల్ సబ్సిడీ వర్తించే విధంగా పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా అందజేస్తామన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ఆర్థికంగా మేలు చేసేందుకు వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకున్నారన్నారు. తోపుడు బండ్లు, చిరువ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ఇలాంటి వారికి కార్డులు అందజేసి బ్యాంకుల్లో సున్నా వడ్డీకే రుణాలు అందించే వీలు కల్పిస్తామన్నారు. రజక, నాయీ బ్రహ్మణ, శాలివాహన కులాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి పథకాలు ప్రకటించిన వైయస్ జగన్కు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.