ఏపీలో ఎన్నికల వేడి రాజుకునేసరికి అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన తెలుగుదేశం బలమైన నేతలు వరుసగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్ను కలిసి.. వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించగా.. తాజాగా విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అవంతికి స్థానికంగా మంచి పేరుంది.. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆయన టీడీపీలో చేరారు. అనంతరం అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. తాజాగా చంద్రబాబు పాలన, టీడీపీ తీరుతో విసిగిపోయిన అవంతి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతోపాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవులు వీడిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటామన్న వైఎస్ జగన్ ఆశయాన్ని గౌరవిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు అవంతి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో ఇద్దరు టీడీపీ సీనియర్లు వైసీపీ వైపు చూస్తునట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఇక్కడ రవికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కరణం వెంకటేష్కు ఇప్పుడు ఆప్షన్ లేకుండా పోయింది.
అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావు నరసారావుపేట నుంచి పార్లమెంటుకు పోటీ చెయ్యాలని అనుకుంటున్నారు. శిద్ధా పార్లమెంటుకు పోటీ చేస్తే కరణంకు దర్శి ఆప్షన్ ఉంటుంది లేని పక్షంలో కరణం వారసుడి పోటీకి సీటు లేనట్టే అవుతోంది. దీంతో కరణం వెంకటేష్ బాలినేనితో సమావేశమై చర్చలు జరిపినట్టు తెలస్తోంది. అలాగే ఇదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. గతంలో గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి 13 వేల స్వల్ప ఓట్ల తేడాతో వైవీ. సుబ్బారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే మళ్ళీ ఒంగోలు నుంచి ఎంపీగా పోటీకి రెడీ అవుతున్న ఆయనకు సానుకూల వాతావరణం అయితే కనపడడం లేదు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల ఎంపిక విషయంలో మాగుంటకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని. వాటిని అధిష్టానం ఆమోదించే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు మానసికంగా సిద్ధం అయ్యారని తెలుస్తుంది.
ఏదేమైనా ప్రకాశం జిల్లాలో ఇద్దరు టీడీపీ సీనియర్ల చూపులు వైసీపీ వైపు ఉండడం ప్రస్తుత పరిస్థితుల్లో హాట్ హాట్గా ఉంది. వీరితోపాటు తోట త్రిమూర్తులు, పంచకర్ల రవి బాబు, శత్రుచర్ల విజయ రామరాజు కూడా వైసీపీలో చేరేందుకు సుముఖత చూపిస్తున్నారట.. అలాగే కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా 35మందివరకూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్ధులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఈ నేపధ్యంలో ఇప్పటికే కడప, కర్నూలు, నెల్లూరు వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతోపాటు గోదావరి, విశాఖ జిల్లాల్లోనూ జగన్ హవా స్పష్టంగా కనిపించనుంది.