నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో బుధవారం ట్విట్టర్ సంస్థ నిర్వహించిన ఆస్క్ ఎంపీ కవిత కార్యక్రమంలో ఆమె దేశవ్యాప్తంగా వివిధవర్గాల నుంచి వచ్చిన ట్వీట్లకు సమాధానాలు ఇచ్చారు. ప్రత్యక్షంగా హాజరైన యువత, విద్యార్థులు, మహిళలు పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రం నుంచి మొదలుకొని జాతీయ రాజకీయాల వరకు స్పందించారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో టీఆర్ఎస్ పార్టీది ప్రధాన పాత్ర అని ఎంపీ కవిత అన్నారు. “కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోంది.. రాహుల్గాంధీ గ్రాఫ్ పైకి రావడం లేదు.. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి.. 2019 తర్వాత ఆ పార్టీలదే హవా ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్కు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణలో మార్పు తెచ్చినట్టుగానే దేశవ్యాప్త మార్పుకోసం ముందుకుసాగుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా పీపుల్స్ ఎజెండా` అని ఎంపీ కవిత అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ రాకపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రాజకీయాల్లో ప్రియాంకది అతిథి పాత్ర. తల్లి కోసం, అన్న కోసం గెస్ట్రోల్గా వచ్చి తిరిగి వెళ్లిపోతుంది“ అని అన్నారు. తన గురించి ప్రస్తావిస్తూ “చిన్నప్పుడు నర్సులు, వారి డ్రెసింగ్, సేవలు చూసి నర్సును కావాలని అనుకునేదాన్ని. తర్వాత వ్యాపారంలో రాణించే మహిళగా ఎదుగాలనుకున్నా. అనంతరం చదువులు, అమెరికా.. అక్కడ వ్యాపారం నిర్వహించా. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో ఉద్యమంలోకి అడుగుపెట్టా. ఉద్యమం రాజకీయాల్లో అడుగుపెట్టేలా చేసింది. ఇందులో మాత్రం నాకు రిటైర్మెంట్ లేదు“అని ప్రకటించారు.