సినీ హీరో మహేశ్ బాబు బ్యాంక్ ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్ చేసిన ఎపిసోడ్ మలుపులు తిరిగింది. ఆయన లీగల్ టీమ్ ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. హైదరాబాద్లోని జీఎస్టీ కమిషనరేట్ అధికారులు కోర్ట్ పరిధిలో ఉన్న అంశంలో కలుగజేసుకుని మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్ల సీజ్ కు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. జీఎస్టీ అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా మహేశ్ బాబుపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ విషయం ఇంకా కోర్ట్ పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలిపివేయాలని ఆదేశించిందని చెప్పారు. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారని ప్రెస్ నోట్ లో ఆయన తరఫు లాయర్లు వివరించారు.
రూ.18 లక్షల 50 వేలు ఉన్న పన్నుని వడ్డీతో కలిపి రూ. 73 లక్షల 50 వేలుగా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారని లాయర్ల ఈ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. 2007 – 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్ కి సేవల పన్ను చెల్లించాలంటూ అధికారులు కోరుతున్నారని మహేశ్ బాబు లీగల్ టీమ్ తెలిపింది. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదని న్యాయవాదులు చెప్పారు. అంబాసిడర్ సర్వీసెస్ ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 తేదీ నుంచి చేర్చారని వివరించారు. మహేశ్ బాబు.. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.