ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ 318వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం రాగోలు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దుసి క్రాస్, బావాజీ పేట, రాగోలు పేట, గట్టుముడి పేట, వంజంగి, వాకాలవలస క్రాస్, లంకం క్రాస్ మీదుగా నందగిరి పేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. వైఎస్ జగన్ తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జగన్ ఇప్పటివరకు 3419.7 కిలోమీటర్లు నడిచారు.
