ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నానంటూ రాజకీయంగా పూర్తి విరోధులు అయిన టీడీపీ కాంగ్రెస్లు కలిసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీతో కలవడాన్ని నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు వసంత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న వట్టి వసంత్ కుమార్ రాహుల్, చంద్రబాబు కలయిక నచ్చని కారణంగానే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. వసంత్ కుమార్ తన రాజీనామా లేఖను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మెయిల్ ద్వారా పంపనున్నట్లు సమాచారం.
వట్టి రాజీనామా చేసినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తాను 1983 నుంచి టీడీపీతో పోరాడుతున్నానని.. అలాంటి పార్టీతో కాంగ్రెస్ కలవడం జీర్ణించుకోలేకపోతున్నట్టు వట్టి వసంత్ కుమార్ తెలిపారు.కాగా, వసంత్ కుమార్ జనసేన లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే త్వరలోనే తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో మాట్లాడక వట్టి వసంత్ కుమార్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని సమాచారం. భట్టి భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి
Post Views: 450