జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దెవా చేశారు. కాంగ్రెస్కు క్యాడర్ లేదు.. టీడీపీకి లీడర్లు లేరు అని కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మీ ఆశీర్వాదంతో గెలిచిన బిడ్డగా.. మీరు తలెత్తుకునేలా పని చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడేళ్లలోనే సిరిసిల్ల రూపురేఖలు మార్చాము. బతుకమ్మ ఘాట్ నిర్మాణం రికార్డుల్లో నిలిచిపోతుందన్నారు కేటీఆర్. రాబోయే మూడేళ్లలో సిరిసిల్లకు రైలు తీసుకువస్తామన్నారు. తన మీద విశ్వాసం ఉంటే తనను మళ్లీ గెలిపించండి.. ఇంతుకు పది రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.
తాము రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే.. అన్ని పార్టీలు ఏకమై టీఆర్ఎస్ను గద్దె దించుతాము అంటున్నాయి. అభివృద్ధిలో రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ను గద్దె దించాలా? ఈ విషయంపై ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. బీజేపీ అద్దె కిరాయి కడుతామనడం సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు. భూమి నుంచి ఆకాశం వరకు కాంగ్రెస్ నాయకులు దేన్ని వదల్లేదు అన్నారు. గత నాలుగేళ్లలోనే ఇసుక ఆదాయం రూ. 2 వేల కోట్లకు తెచ్చాం. ప్రతి ఎకరానికి సాగునీరిచ్చేందుకు ప్రాజెక్టులు కడుతుంటే.. వాటిని అడ్డుకునేందుకు సచ్చిపోయినోళ్ల వేలిముద్రలు ఫోర్జరీ చేసి కోర్టుల్లో కేసులు వేశారని కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపాము. ప్రభుత్వ ఆర్డర్లతో కార్మికుడు నెలకు రూ. 10 వేల వేతనం పొందుతున్నాడు. తాను చెప్పింది తప్పయితే తనను ఓడించండి.. నిజమైతే ప్రత్యర్థులకు మీ ఓటు ద్వారా బుద్ది చెప్పండి అని కేటీఆర్ అన్నారు.