రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధమైంది. ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. శుక్రవారం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణలపై సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. డ్రైవ్లో 33,14,006 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిని పరిశీలించి వివిధ కారణాలతో మూడు లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. మిగతా 30,00,872 దరఖాస్తులను సరైనవిగా గుర్తించామని పేర్కొన్నారు. గతంలో ఉన్న డ్రాఫ్ట్రోల్లో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజాగా మరో 30 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని, కొత్త ఓటరు జాబితాలో 2.91 కోట్ల మంది ఓటర్లుగా నమోదవుతారని చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను నాలుగు భాషల్లో ముద్రించాలని నిర్ణయించింది. ఓటర్ల జాబితా విడుదలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో జాబితాను ఓటర్లు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 16 నియోజకవర్గాల్లో తెలుగుతోపాటు ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఓటర్ల జాబితాను ముద్రించనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మూడు నియోజకవర్గాల్లో తెలుగు, ఆంగ్లం, మరాఠీ భాషలో ఓటర్ల జాబితాను ముద్రించాలని నిర్ణయించింది.