తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధి కారులు కలసి 16 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్తోపాటు ముద్దాయిలుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లోనూ ఈ బృందాలు సోదాలు జరిపాయి. రేవంత్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చూపుతున్న ఆస్తులు, చెల్లిస్తున్న ఆదాయపన్నుకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించింది.
పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి అక్రమార్జనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి నివాసాల్లో గురువారం ఆదాయం పన్ను (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తున్నది. అమెరికా, సింగపూర్, హాంకాంగ్, దుబాయ్.. తదితర దేశాలకు హవాలా మార్గంలో కోట్ల కొద్దీ డబ్బు తరలించారని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఒకే అడ్రస్పై పలు కంపెనీలు పెట్టి చిత్తం వచ్చినట్లు హవాలా చేశారని వెల్లడైందని తెలుస్తున్నది. రేవంత్రెడ్డి మనీలాండరింగ్కు పాల్పడ్డట్టు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటితోపాటు, కొడంగల్సహా మొత్తం పదిహేను ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలను నిర్వహించారు.
ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఐటీ అధికారి స్వరూప్ నేతృత్వంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 12 మంది సభ్యుల బృందం సోదాల్లో పాల్గొన్నది. రేవంత్రెడ్డితోపాటు, ఆయన మిత్రులు, బంధువుల ఇండ్లలోనూ ఈ తనిఖీలు జరిగాయి. రేవంత్రెడ్డి పలు డొల్ల కంపెనీలు సృష్టించి మనీలాండరింగ్కు పాల్పడ్డట్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు జూలై 24న సీబీఐ అధికారులకు, జూలై 27న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పూర్తి సమాచారం సేకరించిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం సోదాలకోసం ఐటీ అధికారుల బృందం వచ్చిన సమయంలో రేవంత్రెడ్డి అందుబాటులో లేరు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆయనను ఐటీ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. రేవంత్రెడ్డి మరికొందరు మిత్రులతో కలిసి 2003లో శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఏర్పాటుచేసినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో రేవంత్రెడ్డి 66 లక్షల పెట్టుబడి పెట్టినట్టు తేలింది. మరో 18 డొల్ల కంపెనీలకు అక్రమంగా డబ్బు మళ్లించినట్టు సమాచారం. 2010 సెప్టెంబర్లో చివరిసారిగా రేవంత్రెడ్డి ఐటీ లెక్కలు చూపించినట్టు తేలింది.