బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్2న పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను సిద్ధం చేశారు. ‘ సెప్టెంబర్ 2 నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మనందరికి ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. కాబట్టి నాజన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గచ్ఛాలు, దండలు తీసుకురావద్దని, వాటికయ్యే ఖర్చు వరదలు, వర్షాలవల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నానని, అంతేకాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీశక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను’ అంటూ ఓ పత్రికా ప్రకటనను సిద్ధం చేశారు. ఇంకా ఆప్రకటన వెలువడకకుందే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈలేఖను చూసిన నందమూరి అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంత గొప్ప మనసు ఉంటే ఇలా తనకోసం ఏమీ చేయొద్దని హరికృష్ణ చెప్పారంటే ఆయన ఎంతో మానవతావాది అంటూ అభిమానులు రోదిస్తున్నారు.
