దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వీటికోసం నగరంలోని కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లా పూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రగతి భవన్ లో శుక్రవారం వివిధ కులాలకు స్థలాల కేటాయించే విషయంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈటెల రాజెందర్, జోగు రామన్న, జగదీష్ రెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి వినోద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివిధ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. వీటితో పాటు వారి సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి, వారి వికాసానికి ఉపయోగపడేవిధంగా ప్రతీ కులానికి హైదరాబాద్ లో ప్రభుత్వమే భవన్లు నిర్మిస్తుంది. ఇందుకోసం అవసమైన స్థలాలు సేకరించాం. నిధులు సిద్ధంగా ఉంచాం. దాదాపు 36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్ నగరంలో 10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మిస్తాం. సంచార ఆత్మగౌరవ భవన్ లో అన్ని సంచార కులాల వారు తమ అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. పేదలు పెండ్లిళ్లు చేసుకోవడంతో పాటు విద్య, సాంస్కృతిక వికాస కేంద్రంగా అది భాసిల్లుతుంది’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
‘‘రాష్ట్రంలోని అన్ని బిసి కులాలు, ఎస్సీలలో ఉన్న బుడగ జంగాల, ఎస్టీలలో ఉన్న ఎరుకల కులానికి కూడా స్థలం కేటాయించి, భవనం నిర్మించడానికి నిధులు ఇవ్వాలని నిర్ణయించాం. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం దేశంలోనే ఇది ప్రథమం. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికికే కాకుండా, సామాజిక వికాసానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కొన్ని కులాలకు స్థలాలు కేటాయిస్తూ, ఉత్తర్వులు జారీ చేశాం. మిగిలిన కులాలకు కూడా స్థలం, నిధులు కేటాయిస్తున్నాం. మున్నూరు కాపులకు 5 ఎకరాలు-5 కోట్లు, దూదేకుల కులానికి 3 ఎకరాలు-3 కోట్లు, గంగ పుత్రులకు 2 ఎకరాలు-2 కోట్లు, విశ్వకర్మలకు 2 ఎకరాలు-2 కోట్లు, నాయీ బ్రాహ్మణులు, ఆరె క్షత్రియులు, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేర, బుడిగ జంగాల, మేదర, పెరిక, చాత్తాద శ్రీ వైష్ణవ, కటిక తదితర కులస్తులకు ఒక్కో ఎకరం, ఒక్కో కోటి రూపాయలు, బట్రాజులకు అర ఎకరం, అర కోటి రూపాయలు కేటాయిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
అన్ని కులాలకు స్థలం, నిధులు కేటాయించినందున వెంనటే భవనాల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని ఆయా శాఖల అధికారులకు, మంత్రులకు, కుల సంఘాలకు ముఖ్యమంత్రి సూచించారు.