తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం డిల్లీలోని తెలంగాణ భవన్లో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. జయశంకర్ సార్ను స్మరించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రకరకాల పరిస్థితులను ఉద్యమ సమయంలో ఎదుర్కోన్నామని, వాటిని అధిగమించేందుకు సార్ వద్ద కూర్చొని చర్చించిన ఆ నాటి సంగతులను ఆమె గుర్తు చేసుకున్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో, మనం వేస్తున్నప్రతి ముందడుగులో వారు లేక పోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాక ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, జయశంకర్ సార్ తెలంగాణ సమస్యలపై మాట్లాడుకున్నారని, దానికి అనుగుణంగా రూపొందించుకున్న బ్లూ ప్రింట్ ప్రకారం ముఖ్యమంత్రి ప్రజల సహకారంతో కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని కవిత వివరించారు. సౌ పడో..ఏక్ లిఖో..ఉర్దూ సామెత ప్రకారం.. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సార్ రాసి పెట్టుకున్నారని కవిత తెలిపారు. కమ్యూనికేషన్ తక్కువగా ఉన్న ఆసమయంలో 1952 నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలను రాసి పెట్టుకున్న విషయాలు ఉద్యమాన్ని నడిపించేందుకు ఉపయోగపడ్డాయని కవిత చెప్పారు.
నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని సార్ జీవితం మనకు తెలియజేస్తుందని అన్నారు. వారి మాటలను ముందుతరాలకు తెలియజేస్తూ వారికి మార్గం చూపే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో…. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను తెలంగాణ జాగృతి ఘనంగా నిర్వహించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినో్త్సవాన్ని పురస్కరించుకుని జాగృతి కార్యకర్తలు కేక్ కట్ చేశారు.