రైలు పట్టాలపై ఎమ్మెల్యే కుమారుడి మృతదేహం పట్నాలో కలకలం రేపింది. బిహార్ రాష్ట్రం పట్నా రైల్వేస్టేషన్ లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా..అది జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి కుమారుడు దీపక్గా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్నా ఎమ్మెల్యే భారతి, ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేశారని ఆరోపించారు. ముసల్లాపూర్లో ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ ఉందని గురువారం రాత్రి దీపక్ ఇంటినుంచి వెళ్లాడని తెలిపారు. కాగా, బిహార్ రాజకీయాల్లో దీపక్ తండ్రి అవ్దేష్ మండల్ కీలక నేతగా ఉన్నారు. ఆయనకు రాజకీయంగా మిత్రులు, శత్రువులు కూడా ఎక్కువేననీ, దీపక్ను ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి నితీష్కుమార్ ఎమ్మెల్యే కుంటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
