తాజాగా నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ పై బుధవారం సాయంత్రం జరిగిన దాడి రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనను గుంటూరు రేంజ్ ఐజీ వేణుగోపాల్, ఎస్పీ రామకృష్ణ రాపూరు కు చేరుకుని విచారించారు. రాపూరు లో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాజేష్ అనే యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగా అతనిని పోలీసులు, ఎస్సై లక్ష్మీకాంతరావు తీవ్రంగా కొట్టారని రాజేష్ బంధువులు, గ్రామస్థులు స్టేషన్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఎస్పైతో పాటు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు స్టేషన్ పే దాడి చేసిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉండడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న ఐజీ రాపూరు పోలీస్ స్టేషన్ లో విచారించారు. పోలీస్ స్టేషన్ పై దాడి జరగడం దురదృష్టకరమని, పోలీసు సిబ్బందిపై దాడి చేయడంతో ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడడం దారుణమన్నారు. ఎస్సైకి 8 కుట్లు పడ్డాయని, మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయని అందరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈదాడిలో 30 మంది పాల్గొన్నట్టు గుర్తించామని, ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని, మరికొంత మందిని త్వరలో పట్టుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రాపూర్ లో ఇంకా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. భారీగా పోలీసులు మోహరించటం, ఊరిలో చాలామందిని అదుపులోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఊరిలో సగంమంది పోలీసులు అదపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంబంధం లేనివారినీ పోలుసులు తీసుకెళ్తున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
