తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ,బీజేపీ దొందు దొందేనని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. ఆ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ కె .పి వివేకానంద ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు గా గుర్తించకున్నా తెలంగాణ సొంత బడ్జెట్ తో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా వసతి కల్పిస్తోందని, ఎన్నో సంక్షేమ పథకాలను దైర్యంగా తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో అమలు కాని అభివృద్ధి పనులు తెలంగాణలో అమలవుతున్నాయని వివరించారు.
ప్రజల అవసరాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని మంత్రి మండిపడ్డారు. “కేంద్రం రొటీన్గా పరిపాలిస్తోంది. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదు. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలను అవిశ్వాస చర్చ సందర్భంగా దేశం గమనించింది. కౌగిలింతలు ,కన్నుగొట్టడాలేనా రాహుల్ చేయగలిగింది? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ వాళ్ళెవరూ లేరు కానీ ఇక్కడి ఆ పార్టీ దద్దమ్మలు పెద్దగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏపీకి ప్రత్యేక హోదా తీర్మానం చేస్తే గనుక అంత కన్నా దుర్మార్గం మరొకటి లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కొన్ని ప్రాంతాలకే పరిమితమై రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ మళ్ళీ ఏపీ వైపే మొగ్గుతోంది` అని తలసాని వ్యాఖ్యానించారు.“ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ,బీజేపీ లు రెండూ దేశానికి ప్రమాదమని మంత్రి తలసాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఇపుడున్న సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. దేశానికి పీఎం మోడీ కూడా చేసిందేమి లేదని, ఆయన తన తీరు మార్చుకోవాలన్నారు. కేసీఆర్ పాలనాదక్షత అందరికీ ఆదర్శమన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వాదన తెచ్చారని వివరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపులో తమ ప్రభుత్వం వివక్ష పాటించడం లేదన్న విషయం జానారెడ్డికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు.“.కాంగ్రెస్ నేతలకు పాలించే జ్ఞానం లేదు. ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతారు? కాంగ్రెస్ నేతాల్లాంటి చిల్లర నేతలు ఎవరూ లేరు“ అని ఆయన మండిపడ్డారు.