అనంతపురంలోని బైపాస్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ను తనిఖీ చేసేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత వేళ్లారు. అక్కడ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు. అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని పలకరించారు. ఆపై “ఏరా… బడికిపోలేదా? ఇక్కడే ఉంటే తంతా రేయ్ ” అంటూ వార్నింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవద్దని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు. ఆ తరువాత ఐదు రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని, అందరితోపాటు భోజనం చేశారు. అక్కడికి వచ్చిన వారికి కాసేపు అన్నం వడ్డించారు.
