తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి నరేగా నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనుల నుంచి మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతీ దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి, వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేపించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి డిపిఆర్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఆదివారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి. రామారావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాటితో కలిపి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఒక్కో గ్రామాన్ని ఒక్కో యూనిట్ గా తీసుకోవాలి. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచాలి. నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయడం, వాటిని పంపిణీ చేయడం, గుంతలు తీయడం, నీళ్లు పోయడం లాంటి పనులన్నీ మానవ శ్రమతో కూడుకున్నవే. వ్యవసాయ కూలీలను ఈ పనులకు ఉపయోగించే అవకాశం ఉంది. నరేగా నిబంధనలు కూడా ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని ఖచ్చితంగా చెప్పాయి. కాబట్టి నరేగా నిధులను తెలంగాణ హరితహారం కార్యక్రమం కోసం వినియోగించడం సముచితంగా, ఉభయ తారకంగా ఉంటుంది. రాష్ట్రంలో చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నరేగా నిధులు వాడుకోవడానికి కార్యాచరణ రూపొందించాలి. పనులకు సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేయాలి. ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘‘అడవులు, చెట్లు పోవడం వల్ల గ్రామాల్లో కోల్పోయిన పచ్చదనం, పర్యావరణం తిరిగి రావాలి. జరిగిన నష్టం ఉండాలి. అడవులు నాశనం కావడం వల్ల అనేక అనర్థాలు కలిగాయి. మానవ జీవితం కల్లోలం అయింది. అడవిలో చెట్ల పండ్లు తిని బతికే కోతులు ఊళ్లమీద పడ్డాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. వంటింట్లోకి కూడా చొరబడి మన తిండిని కూడా ఎత్తుకుపోతున్నాయి. ఇలాంటి పరిణామాలకు అడవులు, చెట్లు లేకపోవడమే కారణం. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల పునరుద్ధరణ జరగాలి. గ్రామాల్లో కూడా విరివిగా చెట్లుండాలి. పండ్ల చెట్ల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నర్సరీల్లో పెంచే మొక్కల్లో 25 శాతం పండ్ల మొక్కలుండాలి. కోతులు, పక్షులు, ఇతర అడవి జీవులు తినే తునికి, ఎలక్కాయ, మొర్రి, నేరెడు, సీతాఫల, జామ తదితర పండ్ల మొక్కలను పెద్ద సంఖ్యలో సిద్ధం చేసి, పంపిణీ చేయాలి. అడవుల్లో, పొలాల దగ్గర, ఖాళీ ప్రదేశాలలో వాటిని పెంచాలి. దీనివల్ల కోతులు, ఇతర అడవి జీవులు జనావాసాల మీద పడకుండా ఉంటాయి. మనుషులు తినే పండ్ల మొక్కలను కూడా సిద్ధం చేస్తే, అందరూ తమ ఇండ్లలో వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు’’ అని ముఖ్యమంత్రి వివరించారు.