తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతల ఎదురుదాడి తారాస్థాయికి చేరుతోంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ఓడిపోయిన నేపథ్యంలో ఇది మరింతగా ముదిరింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ అగ్రనేత పురంధీశ్వరి, బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబోట్ల హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం లేస్తే మనిషిని కాను అనే చిన్నప్పటి కథలాగా ఉందని పురందీశ్వరి ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తాం అని డాంబికాలు నిన్నటితో తేలిపోయాయని ఆమె అన్నారు. ఆంధ్రాకు నిజమైన దోషులెవరో తేలిపోయిందని పేర్కొన్నారు.
చంద్రబాబు ఎవరికి ధన్యవాదాలు తెలపడానికి ఢిల్లీ వెళ్తున్నారని పురందీశ్వరి ప్రశ్నించారు. “కాంగ్రెస్కు ధన్యవాదాలు తెలపడానికి ..చంద్రబాబు వెళ్లడం హాస్యాస్పదం. ఎన్టీఆర్ ఎవరికి వ్యతిరేకంగా పార్టీ స్థాపించారో.. వారి మద్దతుతో అవిశ్వాసం పెట్టడం.. పార్లమెంట్లో ఆత్మగౌరవం తాకట్టు పెట్టడమే“ అని పురందీశ్వరి మండిపడ్డారు. దుగ్గరాజ పట్నం పోర్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు జాప్యం టీడీపీ వల్ల కాదా అని నిలదీశారు. రైల్వే జోన్ ఖచ్చితంగా ఇస్తామని, ఆంధ్రప్రదేశ్ ఏది అడిగిన ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. “అభివృద్ది విషయంలో మేము రాజకీయం చెయ్యం.. చెయ్యబోము“ అని తెలిపారు. 2019లో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసత్య పునాదుల మీద పరిపాలన సాగిస్తోందని పురందీశ్వరి పేర్కొన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని టీడీపీ మంట కలిపిందని, టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పార్లమెంట్ సాక్షిగా బయట పడిందని సుదీశ్ రాంబొట్ల స్పష్టం చేశారు. `హోదా వల్ల ఏం లాభం అని, ప్యాకేజ్ కన్నా మించింది ఏమిటి అని, హోదా ఆలోచన వద్దు అని.. ఇలా వందల సార్లు చంద్రబాబు చెప్పారు. థాంక్యూ మోడీజి అని గతంలో చంద్రబాబు ప్యాకేజ్కు ఒప్పుకున్నారు. ఇప్పుడు బాబు
ప్లేట్ మార్చేశారు. చంద్రబాబు ఎస్పీవీని వద్దంటున్నారు. దీని పరమార్థం ఏమిటో అందరికి తెలుసు.ఎస్పీవీ ద్వారా నిధుల మల్లింపు ఉండదు కాబట్టి… వద్దంటున్నారు..“ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగింది కాబట్టి..మళ్లీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి.. తన తప్పులు బీజేపీ మీద నెట్టి కాంగ్రెస్తో కలిసి గెలుస్తాం అనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని సుదీశ్
రాంబొట్ల ఆరోపించారు. “కాకి హిమాలయాల మీద కూచొని అరిచినా కాకి గోలనే అవుతుంది.. టీడీపీ కూడా అంతే. టీడీపీ అంటే దొంగల, డ్రామాల, దౌర్జన్యకారుల పార్టీగా మారింది“ అంటూ విరుచుకుపడ్డారు.