రైతు బీమా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఒక రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఎన్ని ఖాతాలు ఉన్నా ఒక పాలసీ మాత్రమే వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు.
ఇవాళ ప్రగతి భవన్లో రైతు బీమా, భూరికార్డులకు సంబంధించిన అంశాలపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. రైతులందరికీ రైతు బంధు, జీవిత బీమా వర్తింపజేయాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులను వెంటనే సవరించాలని సీఎం పేర్కొన్నారు. పేరు మార్పిడి తదితర కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పేద, ధనిక తేడా లేకుండా 18 నుంచి 60 ఏండ్లున్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలని సీఎం స్పష్టం చేశారు.