ఉపాధ్యాయుల బదిలీల వల్ల చాలా పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వెంటనే విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోపు మేనేజ్ మెంట్ల వారిగా విద్యావాలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. ఈ రోజు సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరలో జిల్లాల కలెక్టర్లు, డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యావాలంటీర్ల నియామకం, విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్ పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీపై దృష్టి పెట్టి వెంటనే అవి విద్యార్థులకు అందించాలన్నారు.
జూనియర్, డిగ్రీ కాలేజీలలో సాధారణ బదిలీల వల్ల డిస్ట్రబ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కౌన్సిలింగ్ నిర్వహించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా వీరి నియామకం చేపట్టాలని సూచించారు.జూనియర్, డిగ్రీ కాలేజీల గుర్తింపు ప్రక్రియ వెంటనే పూర్తి చేసి, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను విద్యాశాఖ వెబ్ సైట్లో పొందుపర్చాలని, సంబంధిత జిల్లా విద్యాధికారులకు అందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు చెప్పారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తింపు పొందిన కాలేజీల్లోనే విద్యార్థులు చేరే విధంగా ప్రచారం కల్పించాలన్నారు. విద్యార్థులు కూడా కాలేజీల్లో చేరే ముందు వాటికి గుర్తింపు ఉందో, లేదో సరిచూసుకుని చేరాలని సూచించారు. డిగ్రీ కాలేజీలలో విద్యార్థుల అడ్మిషన్ల కోసం నాల్గో రౌండ్ దోస్త్ కౌన్సిలింగ్ నిర్వహించి, ప్రభుత్వ కాలేజీల్లో చేరాలనుకునే ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలన్నారు.
పోటీ పరీక్షలు రాసి వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. జూలై 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించాలని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లా కాలేజీల అనుమతి పొంది వెంటనే అక్కడ అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థలన్నింటిలో అకాడమిక్ క్యాలెండర్ ను పక్కాగా అమలు చేయాలని అధికారులకు చెప్పారు. ఈసారి విద్యా సంస్థల్లో హరితహారం విజయవంతం చేయాలని, ఇందుకోసం ప్రతి పాఠశాలు, కాలేజీ, యూనివర్శిటీ వారిగా వివరాలు సేకరించి పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేయాలన్నారు. ఈ సారి హరితహారం ద్వారా పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలన్ని హరిత విద్యా సంస్థలుగా పచ్చదనంతో కళకళలాడాలని చెప్పారు.