ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10 నుండి 19 వరకు టెట్పరీక్ష జరుగుతుందని, రోజూ రెండు సెషన్లలో టెట్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 3,97,957 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు వివరించారు. 14,891 మంది ఆప్షన్లు పెట్టుకోలేదన్నారు. టెట్ నిర్వహణకు మొత్తం 113 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షకు హెల్ప్లైన్ నంబర్లు (9505619127, 9505780617, 9505853627) ఏర్పాటు చేసినట్టు వివరించారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 10 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. రెండోసారి డీఎస్సీ ద్వారా 10,351 పోస్టులను భర్తీ చేయబోతున్నామని స్పష్టంచేశారు. ఈ పరీక్షరాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
