బాలీవుడ్ నటి బిపాసా బసు అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న బిపాసాను శనివారం ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కొన్ని రోజుల నుంచి బిపాసా ఈ సమస్యతోనే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లారట. సమస్య తీవ్రమవుతుండడంతో కొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ముంబయికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ బిపాసాకు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి బిపాసా కుటుంబీకులు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వడంలేదు.
చివరిగా ‘ఎలోన్’ చిత్రంతో బిపాసా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆమెకు జోడీగా కరణ్ సింగ్ గ్రోవర్ నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకుని వివాహ బంధంతో ఒకటయ్యారు. త్వరలో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.
