ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైందా? అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో చేరుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే సాగుతుంది. సీట్లు ఇఛ్చే అవకాశం లేకపోయినా సరే రాజకీయ కారణాలతో అందరినీ తీసుకొచ్చి తమ పార్టీలో ఉంచేసుకోవాలనేది టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం. ఇప్పుడు అదే దెబ్బకొడుతోంది. నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతోనే యలమంచిలి రవి ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీ నేత వసంత కృష్ణప్రసాద్ కూడా అదే దారిలో పయనించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్ళారు.
ఇదే దారిలో ప్రస్తుతం ప్రకాశం జిల్లా చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడనున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇఫ్పటికే రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ చేరిక వైఎస్ జగన్ పాదయాత్ర అయిపోయిన తర్వాత ఉంటుందా? లేక త్వరలోనే ఉంటుందా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నుంచి నేతలు ఇలా పక్క పార్టీల వైపు చూడటం టీడీపీ నేతల్లో ఒకింత టెన్షన్ పెంచుతోంది.