యువ ఇంజనీర్లకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇతర శాఖల్లో ఎన్నో అవకాశాలు ఉన్నా ఇరిగేషన్ డిపార్టుమెంటును ఎంచుకున్నందుకు అభినందించారు. ఏఈఈలుగా ఎంపికైన యువ ఇంజనీర్లు కష్టపడి పని చేయాలని కోరారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖలో కొత్తగా ఎంపికైన ఎలక్ట్రికల్, సివిల్ ఏఈఈలకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్ డిపార్టుమెంటులో మొత్తం 686 మంది కొత్త ఇంజనీర్ల నియామకం జరిగిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
కోటి ఎకరాల మాగాణి లక్ష్యం సాధించే విధంగా యువ ఇంజనీర్లు కృషి చేయాలని కోరారు. సమన్వయం, సహకారం, ఓపికతో ఇరిగేషన్ డిపార్టుమెంటులో పనిచేయాల్సి ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేసే అవకాశం మీకు వచ్చిందని, వారి దీవెనలు మీకు దొరకడం అదృష్టం అన్నారు.