ఈ నెల 27వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ, ప్లీనరీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా హాజరయ్యేందుకు ఈ రోజు వరంగల్ లోని సి.ఎస్.ఆర్ గార్డెన్స్ లో సన్నాహాక సమావేశం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి పూర్వ ఉమ్మడి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు. మైనింగ్ కార్పోరేషన్ చైర్మన్ గ్యాదరీ బాలమల్లు రాష్ట్ర పార్టీ తరపున హాజరై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాలను వివరించారు. ప్లీనరీని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించుకోవాలని, పాత-కొత్త నేతలంతా కలిసి ప్లీనరీకి హాజరు కావాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో పార్టీ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఇందుకోసం నియోజక వర్గం నుంచి వందమంది ప్రతినిధులను ఈ సమావేశానికి రావల్సిందిగా నిర్ధేశించారన్నారు. నియోజక వర్గానికి వందమందికి పాస్ లు ఇస్తారని, దీనికోసం ఈ నెల 26వ తేదీన నియోజక వర్గం నుంచి ఎంపిక చేసిన వందమంది సభ్యులు తమపేర్లను నమోదుచేసుకోవాలని చెప్పారు. ఇందుకోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారన్నారు. పేర్లు నమోదు చేసుకున్న వారికే బ్యాడ్జీలు, బ్యాగులు అందిస్తారన్నారు. ఈనమోదు చేసుకున్న పేర్లను ఎన్నికల కమిషన్ కు పంపించాలన్న ఆలోచనతో ఈసారి పకడ్బందీగా నమోదు కార్యక్రమం ఉంటుందని సిఎం కేసిఆర్ చెప్పారన్నారు. పార్టీకి సంబంధించిన ప్లీనరీ సన్నాహక సమాశానికి ముఖ్యులు, నేతలు సరిగా రానందుకు బాధగా ఉందని, భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని అన్నారు.
వ్యక్తిగత వాహనాల్లో కాకుండా కలిసి బస్సులో రావాలి .. కడియం
వచ్చే ఏడాదిలో ఎన్నికలున్నందున, ఇప్పుడు జరగనున్న ప్లీనరీ సమావేశం పార్టీకి అత్యంత ముఖ్యమైందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమావేశంలో అన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా పాత, కొత్త అనే తేడా లేకుండా కలిసిమెలిసి రావాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యులు ఈ బాధ్యతలు తీసుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ధేశించినట్లు వందమందిని తీసుకొచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. అయితే నియోజక వర్గానికి వందమంది వస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల్లో కాకుండా బస్సుల్లో రావాలని సిఎం కేసిఆర్ సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, దేశంలోనే నెంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా, అభివృద్ధిలో అందరికంటే ముందుగా వెళ్తున్న రాష్ట్రంగా అందరి ప్రశంసలు అందుకున్నదన్నారు.ఈ ప్లీనరీకి ప్రత్యేకత ఉందని, దీనిలో రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను, ఫెడరల్ ఫ్రంట్ గురించి కూడా చర్చించనున్నారు. మే 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పంపిణీ చేయనున్న పట్టాదార్ పాస్ పుస్తకాలు, వ్యవసాయానికి ఇన్ పుట్ సబ్సిడీ, మిషన్ భగీరథ వంటి పథకాల గురించి పార్టీ నేతలకు వివరించనున్నారని చెప్పారు.