ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటిస్తున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో నిర్వహించిన చంద్రకాంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేదికకు సమీపంగా ఉన్న కాలువలపై నడవటానికి వీలుగా ఏర్పాటుచేసిన రేకులు విరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అమాంతం కాలువలోకి కూరుకుపోయిన బాధితులను పోలీసులు పైకిలాగారు. సీఎం సభలో నాసిరకం ఏర్పాట్లపై జనం పెదవివిరిచారు.సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఏడాది లోగా ఇంటింటి నుంచి చెత్తను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పారు. ప్రతి ఇంట్లో ఎల్ఈడీ బల్బులనే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో సీఎం వెంట పలురువు మంత్రులు, టీడీపీ ముఖ్యులు కూడా ఉన్నారు.
