తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతిచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమాచారం పంపించింది .
వన్యప్రాణి అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.ఎకో సెన్సిటివ్ జోన్ లోని దాదాపు 11వందల ఎకరాల్లో.. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు అభ్యంతరాలు లేవని.. వన్యప్రాణి బోర్డు తెలిపింది. మణుగూరు అటవీ డివిజన్ లోని 645 ఎకరాలు, పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలో 455 ఎకరాల భూమిలో ప్రాజెక్టు పనులను చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
మార్చి 27న ఢిల్లీలో జరిగిన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింట్ కమిటీ సమావేశంలో.. సీతారామ ప్రాజెక్టు అటవీ భూములపై చర్చించారు. మణుగూరు, పాల్వంచ అటవీ డివిజన్లలో ప్రాజెక్టు పనులకోసం భూమిని వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది బోర్డు. వన్య ప్రాణలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అవి స్వేచ్చగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతులు రావడంపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం అటవీ పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు మంత్రి హరీష్ ధన్యవాదాలు తెలిపారు. కాగా గతంలో ఈ అనుమతి కోసం మంత్రి హరీష్ కేంద్ర మంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే.