గోల్డ్కోస్ట్ జరుగుతున్నకామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు తొలి స్వర్ణం వచ్చింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మీరాబాయ్ చాను కామన్వెల్త్ గేమ్స్లోనూ తన సత్తా చాటింది. మహిళల 48 కేజీల విభాగంలో చాను మొత్తం 196 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని ముద్దాడింది. 21వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు వచ్చిన తొలి పసిడి ఇదే.
ఈ కామన్వెల్త్ పోటీల్లో ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న రెండు పతకాలు వెయిట్ లిఫ్టింగ్లోనే కావడం విశేషం. పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా రజతం సొంతం చేసుకుని బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 196 కేజీలు ఎత్తిన చాను కామన్వెల్త్ గేమ్స్లో సరికొత్త రికార్డు సృష్టించింది. చాను స్వర్ణం కైవసం చేసుకోగా.. మారిషస్కు చెందిన హనిత్రా(170కేజీలు) రజతం గెలుచుకోగా, శ్రీలంకకు చెందిన దినూష(155) కాంస్యంతో సరిపెట్టుకుంది.
2014 గ్లాస్గో కామెన్వెల్త్ గేమ్స్లో రజతంతో సరిపెట్టుకున్న చాను ఈసారి ఏకంగా స్వర్ణానికే గురిపెట్టింది. 21వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన చానుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ‘నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాం, ఫస్ట్ గోల్డ్ లేడీ’ అని పెద్ద సంఖ్యలో అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.