జాతీయ రాజకీయాల్లోకి అడుగిడనున్నట్లు ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు తగిన కార్యాచరణను వేగవంతం చేయకముందే ఆయా పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి వైపు ఆసక్తికరంగా చూస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ ఆయా అంవాలపై తన అభిప్రాయాలు పెంచుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన పలు పొరపాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ తగు రీతిలో స్పందించారని ప్రశంసలు వస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీల చట్టం విషయంలో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఆ వర్గాలు ఆందోళన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై పలు చోట్ల దాడులు జరిగాయిం. కొందరు మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో మరోవైపు తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ రెండు అంశాలపై సీఎం కేసీఆర్ సునిశితంగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ బంద్ సందర్భంగా దళితులపై వివిధ రాష్ర్టాలలో జరిగిన దాడులను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుకు గురైన దళితులకు ప్రభుత్వం, సమాజం అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. అణచివేతకు గురైన దళితులకు అండగా ఉండడం కోసమే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని సీఎం తెలిపారు. భారత ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో దళితులకు రక్షణగా ఉండడం కోసం ప్రత్యేక చట్టాలు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. దళితులకు కల్పించిన హక్కులు, తీసుకువచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు తమ హక్కులను కాలరాసే విధంగా తమ రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని దళితులు భావిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. భారత ప్రధానమంత్రి వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ అంశంపై మాట్లాడాలని సీఎం కేసీఆర్ సూచించారు.
మరోవైపు జర్నలిస్టుల పక్షాన కేసీఆర్ గళం వినిపించి దేశం దృష్టిని ఆకర్షించారని పలువురు ప్రశంసిస్తున్నారు. తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నిరాధార, తప్పుడు వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన సందర్భంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని సీఎం గుర్తు చేశారు. తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టుల గుర్తింపు రద్దు చేస్తామనడం దేశంలోని వేలాది మంది జర్నలిస్టులకు ఆందోళన కలిగించే అంశమని సీఎం పేర్కొన్నారు.