ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం అమలు తీరుపై మంత్రి చందూలాల్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి నందన గార్డెన్స్ లో నేడు సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం పథకాలను దేశం మొత్తం ప్రశంసిస్తోందని చెప్పారు.
మిషన్ భగీరథ పనులలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీలోపు అన్నిజనావాసాలకు బల్క్ నీటి సరఫరా అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జూన్ 31లోపు వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు ఇంటింటికి నీరు అందించే విధంగా ఇంట్రా పైప్ లైన్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. జూలై 31వ తేదీలోపు భూపాలపల్లి, వరంగల్ కార్పోరేషన్ పరిధిలో ఇంట్రాపైప్ లైనులు పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందించాలన్నారు. ఇక వేసవిలో ఏ ఒక్క గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని కలెక్టర్లకు ప్రత్యేకంగా విజ్ణప్తి చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో మార్చి 31లోపు పరకాలలోని అన్ని ఇళ్లకు నల్లా నీటిని అందిస్తామని వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత హామీ ఇచ్చారు. ఈ నెలాఖరుకు కనుక నీరిస్తే చాలా మంచి పేరు వస్తదని, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను గొప్పగా సన్మానిస్తామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. భూపాలపల్లి లో ఏప్రిల్ 15లోపు ప్రతి గ్రామానికి బల్క్ వాటర్ సప్లై చేసేలా ప్లాన్ చేస్తున్నామని కలెక్టర్ అమెయ్ కుమార్ తెలిపారు.
నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఉంటూనే కాళేశ్వరం ప్రాజెక్టుల పనితీరును ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్న తీరు అద్భుతంగా ఉందని, మీ మినిష్టర్ అలా ఉంటే …మీరు ఇంకా టెక్నాలజీని ఎందుకు వాడుకోవడం లేదన్నారు. వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పనులు తీరును పర్యవేక్షించాలన్నారు. మిషన్ కాకతీయ 1,2,3,4 కింద చెరువుల మరమ్మత్తుల పనులు జూలై 31,2018 లోపు పూర్తి చెయ్యాలన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు మిషన్ కాకతీయ ఇంజనీర్ల పని తీరును సమీక్షించాలని చెప్పారు. కాకతీయ పనులు సరిగా జరగడం లేదని, ఇరిగేషన్ ఎస్.ఈ ప్రసాద్ నాయకత్వంలో వరంగల్ లో పనులు నాశనమవుతున్నాయని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎస్.ఈ శ్రీనివాస్ రెడ్డిని చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా అనుకున్నంత వేగంగా జరగడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు దొరకడం లేదని చెప్పడం కాకుండా గ్రామాల్లో భూములను కొని అక్కడ వీటిని నిర్మించాలని కలెక్టర్లకు సూచించారు. ఇటీవల కమలాపూర్ నియోజక వర్గంలో కలెక్టర్ ఇలా చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చేస్తే బాగుంటుందన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదు జిల్లాలో నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. వీరంతా ఈ రోజు వరంగల్ లో సమీక్షా సమావేశానికి తొలిసారి హాజరయ్యారు. ఇందులో జయశంకర్ జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్, జనగామ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఉండగా.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ సీపీ గౌతమ్ లను సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అందరికీ పరిచయం చేసారు. అనంతరం కలెక్టర్లకు సొంత అజెండాలు ఉండొద్దని, రాష్ట్ర ప్రభుత్వ ఎజెండానే కలెక్టర్ల ఎజెండాగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలే కలెక్టర్ల పథకాలుగా చేసుకొని వాటిని వేగంగా పూర్తి చేసే విధంగా మీ పని తీరు ఉండాలి అని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన తీయనైన తెలుగుతెలంగాణ తెలుగు ఉగాది బుక్ లెట్ ను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లా పౌర సంబంధాల అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఆవిష్కరించారు.
ఈ సమీక్ష సమావేశం లో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ప్రభుత్వ విప్ లు tబోడెకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, దాస్యం వినయ్ భాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, చల్ల ధర్మారెడ్డి, వొడితేల సతీష్ కుమార్, రాజయ్య, మిషన్ భగీరథ ఈ అండ్ సి సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.