తెలంగాణలో స్మార్ట్సిటీగా పేరొందిన వరంగల్ నగరంలో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికివచ్చిన కాలేజీ అమ్మాయిలను కొన్ని వ్యభిచార ముఠాలు ట్రాప్ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని కళాశాలలు, వసతి గృహాల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని అక్కడ ఉంటున్న అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు.
డబ్బు, బంగారం, విలువైన బట్టలు, స్మార్ట్ ఫోన్లు ఆశ చూపిస్తూ అమాయక అమ్మాయిలను వ్యబిచారంలోకి లాగుతున్నారు.సాయంత్రం వేళల్లో విలువైన కార్లు, బైక్లపై కాలేజీ అమ్మాయిలను తీసుకెళ్లి మర్నాడు తెల్లవారక ముందే హాస్టళ్లకు కొంత దూరంలో దింపి వెళుతున్నారు. ఈ మేరకు అమ్మాయిలకు రోజుకు రూ.500, రూ.1000 ఇస్తూ నిర్వాహకులు మాత్రం రూ.2 నుంచి 4వేల వరకు సంపాదిస్తున్నారు.అంతేగాక ప్రయాణికులు రద్దీగా ఉండే ప్రదేశాల్లో లాడ్జీ లు, హైఫై హోటళ్లలో విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతోంది.
హన్మకొండ బస్స్టేషన్, వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎంజీఎం జంక్షన్, బట్టలబజార్, కేయూ జంక్షన్, సుబేదారి, అడ్వకేట్స్కాలనీ, వడ్డెపల్లి, సహకారనగర్, కేయూ, హసన్పర్తి, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, కాజీపేట, మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారగృహాలు నడుస్తున్నట్టు సమాచారం. వరంగల్ మహానగరంలో సుమారు వందచోట్ల ఇలాంటి రహస్య స్థావరాలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది.