వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేసేలా తెలుగు భాషను ఆసక్తికర సబ్జెక్టుగా, స్కోరింగ్ సబ్జెక్టుగా రూపొందించాలన్నారు. తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా చేయడంపై ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలుగు భాష తప్పనిసరి అమలుపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలలో మాతృభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్న విధానాన్ని, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలలో కూడా తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై తీసుకుంటున్న చర్యలను, వాటిన్నింకటే మన రాష్ట్రంలో ఇంకా మంచిగా తెలుగు భాషను సబ్జెక్టుగా అమలు చేయడంపై రూపొందిస్తున్న విధానాలను వివరించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఈ సబ్ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి తమ ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి వివరించింది.
మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా, ఐదో తరగతి వరకు తెలుగు భాషను చదువుకోని వారికి ఆరో తరగతిలో అత్యంత సులభమైన పద్దతిలో సబ్జెక్టును నేర్చుకునే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఏడో తరగతి వరకు తెలుగు చదువుకోని వారికి ఎనిమిదో తరగతిలో, పదో తరగతి వరకు చదువుకోని వారికి ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగు భాషను సులభంగా నేర్చుకునేందుకు పుస్తకాలను రూపొందిస్తున్నామన్నారు.
సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలులో తమకెలాంటి అభ్యంతర లేదని చెప్పినట్లు ఉప ముఖ్యమంత్రికి సబ్ కమిటీ వివరించింది. తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మార్చడంలో అది విద్యార్థులకు ఆసక్తికరంగా అభివృద్ధి చేయడంతో పాటు స్కోరింగ్ సబ్జెక్టుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కమిటీ సభ్యులతో చర్చించారు. 2018-19విద్యా సంవత్సరంలో తె లుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు కావల్సిన సిలబస్, పుస్తకాలు తయారు చేయాలన్నారు.
భాషా పండితుల అప్ గ్రేడేషన్ పై అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చర్చించారు. ఈ భాషా పండితులకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల తెలుగు ప్రపంచ మహా సభల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. దీనికోసం న్యాయ సలహా తీసుకుని అప్ గ్రేడేషన్ జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్, తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అమలు సబ్ కమిటీ చైర్మన్ తెలుగు విశ్వవిద్యాలయం వీసి సత్యనారాయణ, కన్వీనర్ , ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, సభ్యులు, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు అధికార భాష కమిషన్ చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్ శేషుకుమారి, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సువర్ణ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.