ఇక రాజకీయనాయకుల గురించి చెప్పనవసరంలేదు. నామినేషన్ వేసేప్పటినుండి పదవీకాలం అయిపోయే వరకు సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన పని తీవ్ర చర్చలకు దారితీస్తుంది.నిన్న బుధవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా సిరిపురం జంక్షన్లోని సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన గురజాడ కళాక్షేత్రాన్ని చంద్రబాబు ప్రారంభించాలి. విశాఖ చేరుకున్న బాబు మొదట మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించారు.
ఆ తరువాత గురజాడ కళాక్షేత్రం వద్దకు చేరుకున్న ఆయన బయట ఉన్న గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. దాని తరువాత కళాక్షేత్రం ప్రారంభోత్సవంగా ఉన్నట్లు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించవలసి ఉండగా ఆయన చేయకుండా వెళ్లిపోయారు.కాగా ఈ శిలాఫలకం ఆవిష్కరించకుండానే విమానానికి టైమ్ అయిపోతోందంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఆయన వెంట ఉన్న టీడీపీ నేతలు కొందరు గురజాడ కళాక్షేత్రంలో ప్రారంభోత్సవాలకు హాజరైన ప్రజాప్రతినిధులు పదవులనికోల్పోయారని చంద్రబాబుకు చెప్పడంతోనే బాబు అంత సాహసానికి ఒడిగట్టలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సెంటిమెంట్కు భయపడే సీఎం లోపలికి వెళ్లి శిలాఫలకాన్ని ఆవిష్కరించలేదని కొందరు టీడీపీ నేతలు సైతం మాట్లాడుకోవడం కనిపించింది. అయితే ఆయన వెళ్లిన తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.