మైనార్టీల సంక్షేమం టీఆర్ఎస్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహామూద్ ఆలీ, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ కోట్లాది నిధులతో చేపట్టారని అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో 102 మంది ముస్లిం మత పెద్దలు ఇమాం, మోజం లకు 12 లక్షల వేతనాల చెక్కులు పంపిణీ చేశారు. ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ సలీం, మాజీ ఎంఎల్ఏ గురునాథరెడ్డి, జేసీ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. షాదీముబారక్, మసీదుల పునరుద్దరణ, మైనారిటీలకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
డిప్యూటీ సీఎం మహామూద్ ఆలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంక్షేమం పట్టించుకోలేదని మండిపడ్డారు. 40 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో రాజకీయాలు, అధికారం కోసం మైనారిటీలను వాడుకుంటే సీఎం కేసీఆర్ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను మైనారిటీలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనను దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు అనుసరిస్తున్నారని చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరా, రుణమాఫీ రాష్ట్రానికి గౌరవాన్ని పెంచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ అన్నారు.