ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ను ఇవాళ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు గజల్ గాయకుడు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. తాను పంజగాగుట్టలోని వెబ్ రేడియోలో ప్రోగ్రాం హెడ్గా పనిచేస్తున్నానని, అయితే, తనను గజల్ గాయకుడు శ్రీనివాస్ తొమ్మిది నెలల నుంచి లైంగికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
అంతేగాక, తన వద్ద గజల్ శ్రీనివాస్ తనతో జరిపిన ఫోన్ సంభాషణలు, వీడియోలు అన్నీ ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయం వెలుగుచూస్తే.. తన పరువు పోతుందని తెలిసినా కూడా ఇక తట్టుకోలేని పరిస్థితిలో, ఎటువంటి మార్గంలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితురాలు కుమారి ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ప్రస్తుతం గజల్ శ్రీనివాస్ను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు.