ఎస్సీ వర్గీకరణపై టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి, హోంమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు మాదిగలకు మోసం చేశాయని పేర్కొంటూ…తాము మాత్రం ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు.
ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి వర్గీకరణ చేయాలని కూడా విన్నవించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. చట్ట సవరణ,రాజ్యాంగ సవరణ చేయాలని సూచించామన్నారు. తెలంగాణలో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామని చెప్పామని ఈ ప్రకారమే ఫిబ్రవరి ఆరో తేదీన అపాయింట్మెంట్ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరామని తెలిపారు. ఆ తరువాత ప్రధానమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ క్యాన్సల్ చేసిందని వివరించారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పామని ఉపముఖ్యమంత్రి కడియం గుర్తు చేశారు. జీఈఎస్, గుజరాత్ ఎన్నికలు,మెట్రో ప్రారంభం కావడం వల్ల సమయం సరిపోదని తిరస్కరించారని వివరించారు.
మొన్న రాజ్ భవన్ లో ఇచ్చిన విందులో బీజేపీ లక్ష్మణ్ కూడా వచ్చారని…ఆయన పలుకుబడి ఉపయోగించి అనుమతి కోరాలని కోరామని ఉపముఖ్యమంత్రి కడియం వివరించారు. ఇదంతా కేంద్రం పరిధిలోని అంశం కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మాదిగ,మాదిగ ఉపకులాలు కోరుతున్నాయన్నారు. ఇదంతా ఇష్టం లేకే కేంద్రం వ్యవహరిస్తున్నట్టు అర్ధం అవుతుందన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కి మాదిగ సంక్షేమం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీది అవకాశవాద రాజకీయమని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశము పార్టీ కేంద్రం ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుందని… కానీ పక్క రాష్ట్రంలో మందకృష్ణ ను తిరగనువ్వడం లేదని తెలిపారు. అంటే వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో అర్ధం అవుతుందన్నారు.
అఖిలపక్షాన్ని తీసుకెల్దమని చెప్పిన మందకృష్ణ రాజకీయంగా ఏదో పొందాలని చేస్తున్నాడని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుమానం వ్యక్తం చేశౄరు. సీఎం కేసీఆర్పై అక్కసు పెంచుకున్న కారణంగానే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. గల్లీలో కాదు ఢిల్లీలో కొట్లాడాలని అన్నారు. `మందకృష్ణ ఇక్కడ బీజేపీ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ ఇక్కడ టీఆర్ఎస్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వర్గీకరణను అడ్డుపెట్టుకుని ఇతర పార్టీ లు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుసుకుని మందకృష్ణ వ్యవహరించాలి. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న క్రమంలో రాత్రి పూట సమావేశాలు పెట్టుకొని రోడ్లపైకి రావడం ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మందకృష్ణ ఎందుకు అక్కడికి వెళ్లే ధైర్యం చేయటం లేదు? వర్గీకరణ కేంద్రం పరిధిలోని అంశమని మందకృష్ణ కు తెలుసు. అందుకే కేంద్రం వైఖరి స్పష్టం చేయాలి` అని ఆయన డిమాండ్ చేశారు.